న్యూఢిల్లీ : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఏడు విడుతల్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గురువారం రెండో విడుత జాబితాను ప్రకటించింది. ఇందులో 41 మంది అభ్యర్థుల పేర్లుండగా.. వీరిలో 16 మంది మహిళలున్నారు. ఈ జాబితాలో సయానా అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పూనమ్ పండిట్కు టికెట్ కేటాయించింది. ఆమె అంతర్జాతీయ షూటర్. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సమయంలో ఆమె వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మహిళలకు 40శాతం టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.
రెండో జాబితాలో 16 మంది సీట్లు కేటాయించింది. ఈ జాబితాలో ఆగ్రా కాంట్ (SC) స్థానం నుంచి సికిందర్ వాల్మీకి టికెట్ ఇచ్చింది. వాల్మీకి అఖిల భారతీయ వాల్మీకి మహాసభకు జిల్లా అధ్యక్షుడు. ఉత్తరప్రదేశ్ నగర్ నిగమ్ నీటి శాఖకు చెందిన కర్మచారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. కాంగ్రెస్ ఇంతకు ముందు 125 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. ఇందులో 50 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. 403 స్థానాలున్న యూపీలో ఇప్పటి వరకు 166 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. యూపీలో తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. మార్చి పదిన ఫలితాలు వెలువడనున్నాయి.