లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు కాంగ్రెస్ పార్టీ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్, చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పార్టీ నేత మహ్మద్ అజారుద్దీన్ వంటి నేతలకు చోటు దక్కింది. కాగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను తొలగించారు.
ఇంకా ఈ జాబితాలో పార్టీ నేతలు అజయ్ కుమార్ లల్లూ, మోనా ఆరాధన మిశ్రా, గులాం నబీ ఆజాద్, కమల్ నాధ్, సల్మాన్ ఖుర్షీద్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, జఫర్ అలీ నక్వీ, హరేంద్ర అగర్వాల్, రోహిత్ చౌధరి, సత్యనారాయణన్ పటేల్, తౌకిర్ ఆలం, ప్రదీప్ నర్వాల్, దీపేందర్ సింగ్ హుడా, మహ్మద్ అజారుద్దీన్, నసీముద్దీన్ సిద్ధిఖి, ఆచార్య ప్రమోద్ కృష్ణన్, ప్రదీప్ జైన్, ఆదిత్యా, హార్దిక్ పటేల్, ఇమ్రాన్ ప్రతాప్ఖర్హి, వర్ష గైక్వాడ్, సుప్రియా శ్రీనటె, శివ్ పాండేల పేర్లున్నాయి.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్తో సత్తా చాటాలని కాంగ్రెస్ కసరత్తు సాగిస్తుండగా దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇవ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తనదైన వ్యూహాలకు పదునుపెడుతోంది.