ముంబై: కాంగ్రెస్ నాయకురాలు, జమ్ముకశ్మీర్ పార్టీ ఇంచార్జీ రజనీ పాటిల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ ఈ ఏడాది మే నెలలో కరోనా నుంచి కోలుకున్న అనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతో మరణించారు. దీంతో ఖాళీ అయిన ఈ రాజ్యసభ స్థానానికి బీజేపీ ముంబై ప్రధాన కార్యదర్శి, ఉత్తర భారత నేత సంజయ్ ఉపాధ్యాయను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదు.
ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ థోరట్, నానా పటోలే వ్యక్తిగతంగా కలిసి కోరారు. కాంగ్రెస్ నేతల విన్నపాన్ని మన్నించి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది.
దీంతో బీజేపీ అభ్యర్థి సంజయ్ ఉపాధ్యాయ తన నామినేషన్ను సోమవారం వెనక్కి తీసుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు తన నామినేషన్ను ఉపసంహరించుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 2018 ఏప్రిల్ వరకు ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికైన, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలైన 62 ఏండ్ల రజనీ పాటిల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. 1996లో ఆమె బీడ్ నుండి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు.