ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీపై నార్కొటిక్స్ బ్యూరో అధికారులు రెయిడ్ చేసిన కేసుపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. గుజరాత్లోని ముంద్రా పోర్టులో లభించిన డ్రగ్స్ విషయం నుంచి దృష్టి మళ్లించేందుకే రేవ్ పార్టీపై దాడి కేసును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. అలాగే గుజరాత్లో లభించిన డ్రగ్స్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. గుజరాత్లో అదానీ నడిపే ముంద్రా పోర్టులో 2,998 కిలోల డ్రగ్స్ లభించాయి. రెండు కంటైనర్లలో ఉన్న వీటిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా వుండగా, ముంబై నుంచి గోవా వెళ్తున్న ఒక క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు రెయిడ్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై కాంగ్రెస్ ప్రతినిధి సామా మహమ్మద్ విమర్శలు గుప్పించారు. ‘‘సడెన్గా ఎన్సీబీ అధికారులు రంగంలోకి దిగారు. క్రూయిజ్ షిప్పై దాడి చేసి డ్రగ్స్ పట్టుకున్నారట. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అని ఆమె ప్రశ్నించారు. అసలు సమస్య నుంచి దృష్టి మరల్చేందుకే ఇలా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఫ్ఘానిస్థాన్ నుంచి ముంద్రా పోర్టుకు చేరిన డ్రగ్స్ అసలు సమస్య అని ఆమె చెప్పారు. ఈ డ్రగ్స్తో వేర్పాటు వాద ముఠాలకు నిధులు చేరతాయని ఆరోపించిన ఆమె.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసుపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ స్వరాష్ట్రంలో ఇంత భారీగా డ్రగ్స్ దొరికితే ప్రధాని నరేంద్ర మోదీగానీ, హోంమంత్రి అమిత్ షాగానీ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. క్రూయిజ్ షిప్పై జరిగిన రెయిడ్ను తాము స్వాగతిస్తున్నామని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి అతుల్ లోంధే అన్నారు.
అయితే ముంద్రా పోర్టు ఘటనను కప్పిపుచ్చేందుకే ఈ రెయిడ్ జరిగిందా? అనే అనుమానాలను లేవనెత్తారు. ఈ విషయంపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించలేదు. క్రూయిజ్ నౌకపై రెయిడ్ గురించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే తాను స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు.