తిరువనంతపురం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దుమ్మెత్తిపోశారు. ‘రాహుల్యాన్’ ఇంకా లాంచ్ కాలేదని, ఎక్కడా ల్యాండ్ కాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు, బీజేపీ అభ్యర్థి అనిల్ ఆంటోనీ తరపున గురువారం కేరళలో ఆయన ప్రచారం చేశారు. వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ ఐదేళ్లలో గగన్యాన్ ప్రారంభించబోతోంది. కానీ గత 20 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడి ఆరంభం జరుగలేదు. కాంగ్రెస్ పార్టీ ‘రాహుల్యాన్’ ఇంకా లాంచ్ కాలేదు. ఎక్కడా ల్యాండ్ కాలేదు’ అని విమర్శించారు.
కాగా, 2019లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి ఓడిపోయిన రాహుల్ గాంధీ అక్కడ మళ్లీ పోటీ చేసేందుకు భయపడుతున్నారని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసే ధైర్యం ఆయనకు లేదని అన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు వలస వచ్చారని విమర్శించారు. అయితే ఈసారి వాయనాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ గెలవరని చెప్పారు. ఆయనను ఎంపీని చేయకూడదని వాయనాడ్ ప్రజలు నిర్ణయించుకున్నట్లు తాను విన్నానని అన్నారు.