బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పిలుపుతో కర్ణాటక కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర నిలిచిపోయింది. ఆ రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు పెరుతుండగా, మరోవైపు పది రోజుల పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9న ప్రారంభించింది. తాగు నీటి ప్రాజెక్ట్ డిమాండ్తో రామనగర జిల్లా నుంచి మొదలైన ఈ పాదయాత్ర బెంగళూరులో ముగియనున్నది. అయితే కరోనా నిబంధనల ఉల్లంఘనపై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక హైకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీకి చీవాట్లు పెట్టింది. పాదయాత్రపై నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాద యాత్ర ఐదో రోజైన బుధవారం, ప్రతిపక్ష నేత, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా 60 మందికిపైగా కాంగ్రెస్ నేతలపై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది.
కాగా, కర్ణాటక సీఎం బొమ్మై గురువారం ఉదయం మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్కు లేఖ రాశారు. కావేరీ నదిపై మేకేదాతు ప్రాజెక్ట్ నిర్మాణంపై పరిశీలన చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను విరమించాలని కోరారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా కార్ణాటక కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. పాదయాత్రను వాయిదా వేయమని చెప్పారు.
దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రామనగరలో గురువారం ఉదయం సమావేశమయ్యారు. పాదయాత్ర నిలిపివేతపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. పాదయాత్రను ప్రస్తుతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసుల సంఖ్య తగ్గిన తర్వాత తిరిగి రామనగర నుంచి పాదయాత్రను ప్రారంభిస్తామని, ఏడు రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు.