న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశపెట్టిన ఇథనాల్-పెట్రోల్ పాలసీపై కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ లక్ష్యంగా కాంగ్రెస్ గురువారం విమర్శలు గుప్పించింది. ఈ పాలసీని తండ్రి గడ్కరీ ప్రవేశపెట్టగా, ఆయన కుమారులు దాని ద్వారా విస్తృత ప్రయోజనం పొందుతున్నారని, ఈ వివాదాస్పద ప్రయోజనంపై విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేయాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలన్న జాతీయస్థాయి పాలసీని కేంద్రం ప్రవేశపెట్టడంతో గడ్కరీ కుమారులు నిఖిల్, సారంగ్లు ఈ ప్రాజెక్టులను చేపట్టారని, ఇవి గణనీయమైన అభివృద్ధిని సాధించాయని ఆయన ఆరోపించారు. ఏడాది వ్యవధిలోనే వీరి ఒక కంపెనీ ఆదాయం 18 కోట్ల నుంచి 523 కోట్లకు, మరో కంపెనీ 37 కోట్ల నుంచి 638 కోట్లకు పెరిగిందని ఆయన విమర్శించారు.