వాషింగ్టన్: ఇండియాలో కొవిడ్ సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, కేసులు ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదని అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇండియాలో కరోనా కేసులు చాలా చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఇంకా పీక్ స్టేజ్కు వెళ్లలేదు అని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన అంతర్జాతీయ కొవిడ్ రెస్పాన్స్, హెల్త్సెక్యూరిటీ కోఆర్డినేటర్ గేల్ స్మిత్ అన్నారు. ఇది కొంతకాలం పాటు అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అంశం. అందుకే మేము వెంటనే అత్యవసర సరఫరాలైన ఆక్సిజన్, వైద్య రక్షణ సామాగ్రి, వ్యాక్సిన్ తయారీ ముడి పదార్థాలు వంటివి పంపిస్తున్నాము అని ఆమె చెప్పారు.
ఇండియా నుంచి కావాల్సిన వస్తువుల జాబితా అందగానే ఇంటర్ ఏజెన్సీ చాలా వేగంగా వాటికి ఆమోదం తెలిపినట్లు స్మిత్ వెల్లడించారు. ఇప్పటికే తమ విమానాలు ఇండియాలో ల్యాండయ్యాయని, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచానికి అమెరికా సాయం చేస్తూనే ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.