DK Suresh | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఆరోపించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని విడగొట్టి.. దక్షిణాది రాష్ర్టాలకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తున్నదని ఆరోపించారు. దక్షిణాదిపై కేంద్రం వివక్షను ఇలాగే కొనసాగిస్తే, దక్షిణాది రాష్ర్టాల ప్రజల కోసం ప్రత్యేక దేశం డిమాండ్ తీసుకొస్తామన్నారు.
దక్షిణాది ప్రాంతంపై హిందీ ప్రాంతవాసులు చూపుతున్న వివక్ష కారణంగా.. వేరే గతి లేకనే ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రకటించిన సందర్భంగా సురేశ్ లోక్సభలో మాట్లాడారు. ‘గ్రాంట్ల వివక్షను సరిచేయకపోతే ప్రత్యేక దేశం ఇవ్వండి. గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యమవుతుంది. కేంద్ర నిధుల్లో మా వాటా మాకు అందడం లేదు. మా డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తున్నది. హిందీ వాళ్లు మాపై పెత్తనం చేస్తున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎంపీ సురేశ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశాన్ని మళ్లీ విభజించడానికి కాంగ్రెస్ భయంకరమైన పన్నాగాన్ని పన్నుతున్నదని ధ్వజమెత్తింది. ‘దేశప్రజలు తిరస్కరించడంతో కాంగ్రెస్ వేర్పాటువాదానికి మళ్లీ బీజం వేస్తున్నది. నెహ్రూ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ ఎంపీ సురేశ్ ప్రత్యేక దేశం డిమాండ్ను తెరమీదకు తీసుకొచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ నేతలకు దేశంలో ఉండాలని లేకపోతే, వాళ్ల మాతృదేశం ఇటలీకి వెళ్లిపోవచ్చు’ అని ఎక్స్ వేదికగా భగ్గుమన్నది. సురేశ్ వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీ విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దేశ విభజనపై ఎంపీ సురేశ్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు.
ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నీరుగార్చడమేనని మండిపడ్డారు. సురేశ్పై పార్లమెంటరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. తామందరం దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్లమేనని ఈ సందర్భంగా జోషి గుర్తు చేశారు. తాము దేశాన్ని విభజించాలని అనుకోవడం లేదని.. దక్షిణ, ఉత్తర భారతదేశం మొత్తం ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సురేశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ స్పందించి.. యావత్తు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ విభజనపై డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తాము ఎంతమాత్రం సహించబోయేది లేదని తేల్చి చెప్పారు. ‘దేశాన్ని విడగొట్టాలంటూ మా పార్టీ నేతలే కాదు ఏ పార్టీవాళ్లు వ్యాఖ్యానించినా మేం ఎంత మాత్రం సహించబోం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మనమంతా ఒకటే. మనదంతా ఒకే దేశం. ఎప్పుడూ అలాగే ఉంటాం’ అని పేర్కొన్నారు. భారతీయుడినైనందుకు తాను గర్వపడుతున్నానన్నారు.
పార్లమెంట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సురేశ్కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హితవు పలికారు. సురేశ్ విభజన వ్యాఖ్యలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. కాంగ్రెస్ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సురేశ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నిధుల కేటాయింపుల విషయంలో బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష చూపిస్తున్నదన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు.