న్యూడిల్లీ : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవ వేడుకలపై (Ayodhya Ram Temple) కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. దేశంలో ప్రముఖమైన నాలుగు శంకరాచార్య పీఠాల సూచనలతోనే ఈ కార్యక్రమం జరుగుతుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కొన్ని సంప్రదాయాలు, క్రతువులు ఉంటాయని, ఇది మతపరమైన కార్యక్రమం కావడంతో అసలు నలుగురు శంకారాచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నదా అని పవన్ ఖేరా ప్రశ్నించారు.
అసంపూర్తిగా ఉన్న ఆలయానికి ప్రాణ ప్రతిష్ట చేయరాదని నలుగురు శంకరాచార్యులు చెబుతున్నారని అన్నారు. భక్తుడికి, దేవుడికి మధ్య దళారీగా రాజకీయ నాయకులు కూర్చోవడం తగదని, ఇది రాజకీయ కార్యక్రమం కాదని పవన్ ఖేరా స్పష్టం చేశారు. రామాలయ ప్రారంభోత్సవానికి ఏ పంచాంగం ప్రకారం బీజేపీ తేదీని ఖరారు చేసిందని ఆయన నిలదీశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయాన్ని ప్రారంభిస్తున్నారని అంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్దేవ్ విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చారని ఆయన మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు రానుండటంతోనే ఆలయం పూర్తికాకుండానే ప్రారంభిస్తున్నారని ఛత్తీస్ఘఢ్ మాజీ సీఎం కూడా అయిన సింగ్దేవ్ ఆరోపించారు.
Read More :
Sam Altman | బాయ్ఫ్రెండ్ని పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్.. ఫొటోలు వైరల్