Amarinder Singh | కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గందరగోళంలో పడిందని, దీని ప్రభావంతో పంజాబ్ అంతటా ఆందోళన చెందుతున్నదని ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్టీలో సంక్షోభం పరిష్కారంలో తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్దాలు చెబుతున్నారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తనకు వ్యతిరేకంగా 79 మంది ఎమ్మెల్యేల్లో 78 మంది ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా చెప్పారని అమరీందర్ సింగ్ అన్నారు. సీఎంను తప్పించాలని 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖలు రాశారని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ చెప్పడమే దీనికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి రాసిన లేఖపై ఎమ్మెల్యేలతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యావత్తు.. నవ్జ్యోత్ సింగ్ సిద్దూ మాయలో ఉందన్నారు. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకమని చెప్పినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.