Punjab Polls | పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలన్న అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం డోలాయమానంలోనే ఉంది. ప్రస్తుతం సీఎంగా వున్న చెన్నీనే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదంటే పీసీసీ అధ్యక్షుడిగా వున్న సిద్దూను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న అంశంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పంజాబ్ సీఎం ఎవరన్నది పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీయే చిట్ట చివరికి కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత ఇదే అంశాన్ని తేల్చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని మార్చుకొని, ఆమ్ఆద్మీ పంథాలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్లో ప్రస్తుతం రెండు స్తంభాలాట నడుస్తోంది. ఒకరు సీఎం చెన్నీ వర్గం కాగా, మరొకరు పీసీసీ అధ్యక్షుడు సిద్దూ వర్గం. సీఎం పగ్గాలు చేపట్టాలని సిద్దూ ప్రయత్నాలు చేస్తుండగా, మరో మారు సీఎంగా చేయాలని ప్రస్తుత సీఎం చెన్నీ పావులు కదుపుతున్నారు. దీంతో ఎటు వైపు మొగ్గాలో పార్టీ అధిష్ఠానానికి పాలు పోవడం లేదు. దీంతో నొప్పింపక.. తానొవ్వక.. అన్న సూత్రం ప్రకారం నడుచుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమ్ఆద్మీ లాగే సీఎం అభ్యర్థిత్వంపై ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్లు, కాల్స్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలుపొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాయిస్ మెసేజ్లో మొదటి ఆప్షన్గా సీఎం చెన్నీ పేరు, రెండో ఆప్షన్గా సిద్దూ పేరును చేర్చనున్నట్లు సమాచారం. ఇక మూడో ఆప్షన్గా సీఎం పేరు ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లడం అన్న ఛాయిస్ను కూడా కాంగ్రెస్ చేర్చడానికి రెడీ అయినట్లు కాంగ్రెస్ ముఖ్యలు పేర్కొంటున్నారు.
పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఆమ్ఆద్మీ సరికొత్త పంథాను అనుసరించింది. ప్రజాభిప్రాయం ద్వారానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్ణయించారు. ఇందులో భాగంగా టెలీ ఓటింగ్ ద్వారా ప్రజలు సీఎం అభ్యర్థిని సూచించాలంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ పద్ధతిలో ప్రజలు ఎక్కువ శాతం భగవంత్ మాన్వైపే మొగ్గు చూపారు. దీంతో పంజాబ్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ఎంపీ భగవంత్ మాన్ను ప్రకటించారు.