న్యూఢిల్లీ : సాయుధ బలగాల్లో చేపట్టిన రిక్రూట్మెంట్ స్కీం అగ్నిపథ్ను మోదీ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని కాంగ్రెస్ శుక్రవారం డిమాండ్ చేసింది. సాయుధ బలగాల నియామకానికి వయో పరిమితిలో మూడేండ్ల సడలింపు ఇవ్వాలని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ దీపీందర్ సింగ్ హుదా కోరారు.
ఉపాధి అవకాశాలు కోల్పోయామనే ఆవేదనలో కుంగుబాటుకు లోనైన వారు, బలవన్మరణానికి పాల్పడిన వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని దీపీందర్ హుదా డిమాండ్ చేశారు. రక్షణ శాఖలో ఖాళీల భర్తీపై చర్చించేందుకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీంను ప్రకటించిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగార్ధులు, విద్యార్ధులు నిరసన చేపట్టారు. యూపీ, బిహార్, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి.