న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. శనివారం అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీ తదుపరి అధ్యక్షుడిగా చాలా మంది నేతలు రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకొంటానని రాహుల్ ఈ సందర్భంగా వారికి సమాధానమిచ్చారు. సీడబ్ల్యూసీ భేటిలో సోనియా మాట్లాడారు. పార్టీ పరంగా ఏమైనా సమస్యలుంటే తనతో చెప్పాలని, మీడియాకు కాదంటూ జీ 23 నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలిని తానేనన్న సంగతి మరువొద్దన్నారు. స్వీయ నియంత్రణతో, క్రమశిక్షణతో పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు. కాగా, కాంగ్రెస్ సంస్థాగత మార్పులు జరుగాలని, జాతీయాధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించాలని జీ 23 నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.