న్యూఢిల్లీ : ఎంసీడీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో విజయం కొంత ఊరట కలిగిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. 68 స్దానాలు కలిగిన హిమాచల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్కు 35 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాల్సి ఉండగా, కాంగ్రెస్ 40 స్ధానాలను గెలుచుకునే దిశగా ముందుకు సాగుతోంది.
బీజేపీ 26 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా ఇతరులు మూడు స్ధానాలను గెలుచుకోనున్నారు. ఇక హిమాచల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. హిల్ స్టేట్లో స్పష్టమైన మెజారిటీ సాధించనుండటంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ నెలకొంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావంతోనే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ ప్రభావంతో పాటు ప్రియాంక గాంధీ ప్రచారం, పర్యవేక్షణ, నాయకుల సమిష్టి కృషితో బీజేపీని మట్టికరిపించామని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.