న్యూఢిల్లీ: రేపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల సంఘం ( Congress CEC meet ) సమావేశం కానున్నది. శనివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. సోనియాగాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
కాంగ్రెస్ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను పూర్తిగా అధ్యక్షురాలు సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీకి అప్పగించింది. దాంతో ఆమె రాష్ట్ర నేతలతో సమావేశమవుతూ పలు కీలక నిర్ణయాలు చేస్తున్నారు. ఇప్పటికే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలకు 40 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ఆమె ప్రకటించారు. తాజాగా యూపీలో అధికారంలోకి వస్తే విద్యార్థినులకు ల్యాప్టాప్లు, స్కూటీలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.