తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం(కేఎస్యూ) నాయకులు మహిళా మంత్రిపై దాడికి దిగారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జిపైకి దూసుకెళ్లారు. దాడిలో మంత్రి మెడ, చేతికి గాయాలయ్యాయి. దీంతో ఆమెను సమీపంలో ప్రభుత్వ దవాఖానలో చేర్చారు. బుధవారం వీణా జార్జి కన్నూర్ రైల్వే స్టేషన్కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్టు సీపీఎం నాయకుడు పి జయరాజన్ చెప్పారు. ఘటనను సీఎం పినరయ్ విజయన్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ దుర్మార్గపు రాజకీయాలకు ఇది ఉదాహరణగా పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్పైకి వెళ్తుండగా ఆమెపై దాడి జరిగిందని విజయన్ తెలిపారు.
ఈ ఘటనకు కాంగ్రెస్, దాని నేతృత్వంలోని యూడీఎఫ్ బాధ్యత వహించాలని అన్నారు. నిరాధార ఆరోపణలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. అలప్పుజలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళకు శస్త్రచికిత్స చేసి, కడుపులో కత్తెర మర్చిపోయిన ఘటనపై ప్రతిపక్షాలు వారం రోజులుగా నిరసన చేపడుతున్నాయి. కన్నూర్ రైల్వే స్టేషన్లో నిరసనకారులు మంత్రిని చుట్టుముట్టారని, దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆమెను పక్కకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించినప్పుడు నిరసనకారుల గుంపు మధ్య ఆమె చిక్కుకున్నారు.