న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాషాయ పార్టీని దీటుగా ఎదుర్కొని పాలనా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
బీజేపీని దెబ్బతీసేందుకు ఈ రాష్ట్రాలకు పరిశీలకులుగా ఏకంగా పార్టీ సీఎంలనే రంగంలోకి దింపింది. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకుడిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నియమించారు. ఇక చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకుడిగా నియమించారు.
ఇటీవల జరిగిన యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన కనబరచగా బీజేపీ ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుంది. ఇక పంజాబ్లో పాలక కాంగ్రెస్ను మట్టికరిపించిన ఆప్ పాలనా పగ్గాలను చేపట్టింది.