Sonia Gandhi : కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ తాజాగా ఆస్పత్రిలో చేరారు. గురుగ్రామ్లోని మేదాంత– ద మెడిసిటీ ఆస్పత్రిలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సోనియా గాంధీ సాధారణ చెకప్ కోసం చేరారా.. లేక ఏదైనా అనారోగ్య కారణంతో చేరారా అనే విషయంలో అధికారిక ప్రకటన రాలేదు.
ఈ విషయంలో పార్టీ నేతల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే, సాధారణ చెకప్ కోసమే సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నాలుగు రోజులుగా సోనియా గాంధీ ఈ ఆస్పత్రిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మార్చిలో ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకున్నారు. జ్వరం, ఇతర సమస్యల కారణంగా దాదాపు వారం రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. రక్తం కలుషితం అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు.
అనేక సమస్యల కారణంగా ఆమె తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటారు. కొన్ని నెలల క్రితం ఉదర సమస్యల కారణంగా సోనియా గాంధీ అదే అస్పత్రిలో చేరారు. గత ఫిబ్రవరిలో కూడా గ్యాస్ట్రో సమస్యల కారణంగా మళ్లీ చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు గత ఏడాది జూన్లో కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సెప్టెంబర్ 2022 నుంచి ఆమె పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.