Department Manager | న్యూఢిల్లీ : ఆఫీసులో అలసటొచ్చి రెప్ప వాల్చిన ఉద్యోగిని కంపెనీ విధుల నుంచి తొలగించింది. ఆ మాత్రానికే తొలగిస్తారా? అంటూ కోర్టుకెక్కిన ఉద్యోగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అతడికి రూ.41.6 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చైనా జియాంగ్షు ప్రావిన్స్లోని టైజింగ్లో జరిగిందీ ఘటన. ఝాంగ్ ఓ కెమికల్ ఫ్యాక్టరీలో డిపార్ట్మెంట్ మేనేజర్గా 20 ఏండ్లుగా పనిచేస్తున్నాడు.
ఈ ఏడాది మొదట్లో విధులకు వచ్చిన ఝాంగ్ డెస్క్పై గంట పాటు కునుకు తీయడాన్ని సీసీటీవీలో చూసిన కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. తనను తొలగించడం చట్టవిరుద్ధమని భావించిన ఝాంగ్ కంపెనీపై కోర్టుకెక్కాడు. కేసును విచారించిన టైజింగ్ పీపుల్స్ కోర్టు న్యాయమూర్తి.. అతడు తొలిసారి విధుల్లో నిద్రపోయాడని, ఆ కారణంగా కంపెనీకి తీవ్రమైన నష్టమేమీ వాటిల్లలేదన్నారు. ఉద్యోగం నుంచి అకారణంగా తొలగించినందుకు రూ. 41.6 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.