UGC | న్యూఢిల్లీ, మార్చి 28: మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు కామన్ కౌన్సెలింగ్ నిర్వహించినట్టుగానే సీయూఈటీ స్కోర్ ఆధారంగా వివిధ వర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కామన్ కౌన్సెలింగ్ను చేపట్టే అంశాన్ని యూజీసీ పరిశీలిస్తున్నది. దీనిపై దేశంలోని వివిధ వర్సిటీల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేసినట్టు యూజీసీ వర్గాలు తెలిపాయి.
పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా తొలుత దీనిని ఐదు వర్సిటీల్లో చేపట్టే ఆలోచన ఉందని, ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందన్నది కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొన్నాయి. ‘ప్రస్తుతం వివిధ వర్సిటీల్లో యూజీ కోర్సుల కౌన్సెలింగ్ వేరు వేరుగా ఉంది. దీని స్థానంలో సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. ఒకే ఆన్లైన్ పోర్టల్ ద్వారా వివిధ వర్సిటీలకు దరఖాస్తులు చేసుకునేలా ఉంటుంది’ అని యూజీసీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర వర్సిటీల్లో యూజీ కోర్సుల అడ్మిషన్లకు ‘సీయూఈటీ’ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.