న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ చట్టాలకు లోబడే తాము పనిచేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి కొత్త ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక చట్టాలకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు అనుగుణంగా తాము సేవలు అందించనున్నట్లు సీఈవో పిచాయ్ తెలిపారు. కొత్త ఐటీ నిబంధనలు ఇప్పుడిప్పుడే అమలులోకి వచ్చాయని, లోకల్ టీమ్స్ వాటి గురించి విశ్లేషిస్తున్నారని, తమ సేవలు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చట్టాలను గౌరవిస్తామని, వారితో కలిసి పనిచేస్తామని, తమ నివేదికలన్నీ పారదర్శకంగా ఉన్నాయని సుందర్ పిచాయ్ చెప్పారు.
ఫ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ వ్యవస్థీకృతమైందని, భారత్లో ఆ సాంప్రదాయం ముందు నుంచే ఉందన్నారు. రాజ్యాంగ విధానాలను తమ కంపెనీ గౌరవిస్తుందని, అవసరమైన చోట వెనక్కి తగ్గినట్లు కూడా ఆయన తెలిపారు. టెక్నాలజీతో ప్రపంచ రూపురేఖలు మారిపోయాయని, సాంకేతిక పరిజ్ఞానం సమాజాన్ని మార్చేసిందన్నారు. యూరోప్లో కాపీరైట్ ఆదేశాలు ఉన్నాయని, భారత్లో సమాచార నియంత్రణ ఉందని, ఇలా వివిధ దేశాల్లో ఉన్న సమస్యలను పరిగణించి తాము ముందుకు వెళ్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, గూగుల్ లాంటి సోషల్ మీడియా కంపెనీల వినియోగం ఇటీవల పెరిగింది. వాటిపై వస్తున్న కాంటెంట్కు వాటినే బాధ్యుల్ని చేసే విధంగా ఇటీవల ప్రభుత్వం కొత్త ఐటీ రూల్స్ను తీసుకువచ్చింది.