ముజాఫర్పూర్, జూలై 7: చేయని పనికి జీతం ఎందుకు తీసుకోవాలనుకున్నాడు ఓ ప్రొఫెసర్. కరోనా కారణంగా దాదాపు మూడేండ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోయినప్పటికీ వేతనాన్ని ఇచ్చిన కళాశాల యాజమాన్యానికే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు. అనుకోవడమే తడువుగా వెంటనే రూ. 24 లక్షల విలువైన చెక్కును కళాశాల యాజమాన్యానికి ఇచ్చేశాడు. ఈ ఘటన బీహార్లోని నితీశ్వర్ కాలేజీలో చోటుచేసుకుంది.
పీహెచ్డీ చేసిన లలన్కుమార్ నితీశ్వర్ కాలేజీలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. ఈ కాలేజీ బాబా సాహెబ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నది. అయితే లలన్కుమార్ కాలేజీలో చేరిన కొద్ది రోజులకే కరోనా విజృంభించడంతో కాలేజీ మూతబడింది. ఆన్లైన్ క్లాసులు జరిగినా విద్యార్థులు ఆసక్తి చూపలేదు. దీంతో తన 33 నెలల జీతాన్ని కాలేజీకి తిరిగి ఇచ్చేశాడు. పాఠాలు చెప్పకున్నా జీతం తీసుకున్నానని, ఇది తన అంతర్మాతకు నచ్చడం లేదని, అందుకే తిరిగి ఇచ్చేశానని లలన్కుమార్ తెలిపారు. అయితే తనను పీజీ కాలేజీకి బదిలీ చేయకపోవడంతోనే ఇలా జీతాన్ని వెనక్కి ఇచ్చేశాడని విమర్శలు కూడా ఉన్నాయి.