లక్నో: కాలేజీ విద్యార్థిని అడ్డగించిన కొందరు వ్యక్తులు ఆమెకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. (College girl drugged, raped ) రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 1న కాలేజీ అనంతరం ఒక విద్యార్థిని ఇంటికి తిరిగి వెళ్తున్నది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. ఆ యువతికి డ్రగ్ను ఇంజెక్ట్ చేశారు. మత్తులో ఉన్న ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, వైరల్ అయిన ఈ వీడియో క్లిప్, మూడు రోజుల తర్వాత బాధిత యువతి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు తనను లాక్కెళ్లి డ్రగ్స్ ఇచ్చారని, మత్తులో ఉన్న తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.
అలాగే అత్యాచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. నిందితుల్లో ఒక వ్యక్తి గ్రామ పెద్దకు చెందిన బంధువని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.