న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. చలి తీవ్రత తట్టుకోలేక జనం చలిమంటలు వేసుకుంటున్నారు. వేడివేడి చాయ్లు, కాఫీలు లాగిస్తూ ఒంట్లో వేడిని పెంచుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్లో చలికితోడు దట్టమైన పొగమంచు కూడా దాపురించింది. ఈ ఉదయం వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్, కాన్పూర్, మొరదాబాద్ నగరాల్లో పొగమంచు దట్టంగా కమ్మింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే చలి ఇంత తీవ్రంగా ఉంటే ఇకముందు ఇంకెలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.