న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్ -19) నుంచి రక్షణ కల్పించే టీకా కోసం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం వెబ్ పోర్టల్ కో-విన్లో తాజాగా అదనపు ఫీచర్లను శుక్రవారం అందుబాటులోకి తెచ్చారు. కో-విన్లో పేర్ల రిజిస్ట్రేషన్ పరిమితిని పొడిగించారు. ఇప్పుటి వరకు ఉన్న నలుగురు సభ్యులకు బదులుగా ఒక మొబైల్ నంబర్ నుండి ఆరుగురు సభ్యుల పేర్లను నమోదు చేయవచ్చు. అలాగే అదనంగా ఒక కొత్త యుటిలిటీ ఫీచర్ కూడా జోడించారు. ఇప్పటికే రిజిష్టర్ చేసుకున్న లబ్ధిదారుడు తన లేక తమ టీకా స్థితిని మార్చడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిగా లేదా పాక్షికంగా లేదా టీకా వేయని స్థితిపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.
కరోనా టీకా లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూపొందించిన కో-విన్ వెబ్ పోర్టల్లో వివిధ యుటిలిటీ ఫీచర్లపై అప్డేట్లో భాగంగా తాజాగా మార్పులు చేశారు. కో-విన్ ప్లాట్ఫారమ్లో ఈ అప్డేట్లను జోడించారు.
కాగా, టీకా లబ్దిదారుల డేటాను పోర్టల్లో అప్డేట్ చేస్తున్నప్పుడు వ్యాక్సినేటర్ అనుకోకుండా చేసే తప్పిదాల వల్ల డేటా ఎంట్రీలో పొరపాట్లు వస్తున్నాయి. దీంతో వివిధ సందర్భాలలో టీకా ధృవీకరణ పత్రాలు, వ్యాక్సినేషన్ స్టేటస్ తప్పుగా జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా స్థితిని లబ్ధిదారులు స్వయంగా సరిదిద్దడానికి ఈ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చారు.