న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆలోచనలు తమపై రుద్దొద్దని, దానికి బదులు దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలని బీజేపేయేతర రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. రాష్ర్టాలకు జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేండ్ల పాటు అందించాలని కోరాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు రాష్ర్టాలు తమ డిమాండ్లను కేంద్రం ముందుంచాయి. పంటలకు కనీస మద్దతు ధర, ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ర్టాలకు సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, నీటిపారుదల సదుపాయాలు, మినరల్స్కు రాయల్టీ, జాతీయ విద్యా విధానం తదితర అంశాలపై తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరాయి. కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్లొద్దంటూ హితవు పలికారు.
ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసే ముందు రాష్ర్టాలను సంప్రదించాలని చెప్పారు. పైగా రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా చట్టాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కరోనా కారణంగా కేరళలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయని, కేరళ రుణ పరిమితి పెంచాలని కోరారు. నిత్యావసరాలపై విధించిన జీఎస్టీని మరోసారి సమీక్షించాలని సూచించారు. రాష్ర్టాల డిమాండ్లను కేంద్రం సీరియస్గా తీసుకోవాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని రాష్ర్టాలపై బలవంతంగా రుద్దొద్దని ఆమె కోరారు.
వ్యవసాయ ఆధునీకరణ చేపట్టాలి..
దేశంలో ఎగుమతులు పెంచేలా, దిగుమతులు తగ్గించేలా వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికతను (మూడు ‘టీ’లు)ప్రోత్సహించేందుకు రాష్ర్టాలు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. వ్యవసాయ, పశు పోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆధునీకరణ చేపట్టాలని పేర్కొన్నారు. వీలైనంత మేర స్థానికంగా తయారైన ఉత్పత్తులు మాత్రమే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని స్థానికం కోసం గళం అనేది రాజకీయ ఎజెండా కాదని, అదో మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఎవరి సామర్థ్యాల మేరకు రాష్ర్టాలన్నీ విజయవంతంగా పనిచేశాయని కితాబిచ్చారు. నీతి ఆయోగ్ సమావేశాలు కరోనా కారణంగా రెండేండ్ల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.