CM Himanta Biswa Sarma | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ గురించి తనకు పెద్దగా తెలియదని, సినిమాలు చూడనని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సోమవారం స్పష్టం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ గురించి తనకు అంతగా అవగాహన లేదన్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ ఎవరో తెలియదన్న ముఖ్యమంత్రి.. 24 గంటలు గడవక ముందే షారుఖ్ ఖాన్ తనకు ఫోన్ చేశారని ప్రకటించారు. ఆ తర్వాత ఆయనపై పలువురు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన స్పందించారు.
అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్రల సినిమాలు చూశానని, షారుఖ్ ఖాన్ గురించి పెద్దగా తనకు తెలియదన్నారు. 2001 నుంచి తాను ఆరు నుంచి ఏడు సినిమాలకు మించి చూడలేదన్నారు. షారుఖ్తో ఫోన్ సంభాషణ గురించి స్పందిస్తూ.. శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో ‘నేను షారుఖ్ ఖాన్ని. నేను మీతో మాట్లాడాలి’ సందేశం వచ్చిందని, అప్పటికే తనతో మాట్లాడేందుకు చాలా మంది క్యూలో ఉండడంతో వాటిని క్లియర్ చేసిన తర్వాత ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
సినిమా త్వరలో విడుదలవుతుందని, ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నానని చెప్పారన్నారు. అసోం పేరు చెడగొట్టే ప్రయత్నాలను ప్రభుత్వం అనుమతించదన్నారు. ‘షారుఖ్ ఖాన్ ఎవరు?’ ప్రకటన ప్రశ్నించగా.. ‘నేను అతని గురించి ఎందుకు తెలుసుకోవాలి? అతను అంత గొప్పవాడని నాకు నిజంగా తెలియదు. నేను ఎక్కువగా సినిమాలు చూడను. పాతతరం నటుల గురించి తెలుసు’ అన్నారు. ‘పఠాన్’ పోస్టర్లను చింపివేయడాన్ని ప్రస్తావిస్తూ.. పోస్టర్లను చింపివేయడం నేరం కాదని, వాటిని ఏ చట్టం కింద బుక్ చేయాలో తెలుసుకోవాలన్నారు.
రాజకీయ నాయకుల పోస్టర్లు నిత్యం చిరిగిపోతున్నా.. దానిపై చర్చ జరగడం లేదన్నారు. ఇప్పుడు ప్రజల ఆలోచనా ధోరణి మారాల్సిన సమయం ఆసన్నమైందని, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇటీవలే ఇక్కడి నారేంగి ప్రాంతంలోని సినిమా హాలులోకి చొరబడి ‘పఠాన్’ పోస్టర్లను చింపి, వాటిని తగులబెట్టి, సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటించిన ‘పఠాన్’ జనవరి 25న థియేటర్లలోకి రానుంది.