పాట్నా: కేంద్ర మంత్రి అశ్విని చౌబే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నపుంసకుడని ఆయన విమర్శించారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై మండిపడిన ఆయన ఈ మేరకు మీడియాతో అన్నారు. రెండు రోజుల కిందట భాగల్పూర్లో నీలమ్ అనే మహిళను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో కత్తులతో ఆమెపై దాడి చేసి చేతులు, రొమ్ములు, చెవులను నరికి చంపారు.
ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన కేంద్ర మంత్రి అశ్విని చౌబే ఈ దారుణ హత్యపై స్పందించారు. కైమూర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం నితీశ్ కుమార్, ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘బీహార్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నపుంసకత్వానికి బలైపోయారు. నేను ఇలా అనడానికి కారణం రెండు రోజులుగా ప్రజలు హత్యకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది’ అని అన్నారు.
మహిళల చేతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారని, ఇది జంగిల్ రాజ్ కాకపోతే మరేమిటని కేంద్ర మంత్రి అశ్విని చౌబే ప్రశ్నించారు. 48 గంటల్లో ఆరు ఘోర నేరాలు జరిగాయని తెలిపారు. ‘బీహార్ను నడపలేరని నితీశ్కు చెప్పాలనుకుంటున్నాను. మీరు రాజీనామా చేయాలి’ అని అన్నారు.
మరోవైపు బీహార్లోని అధికార జేడీయూకు చెందిన సంజయ్ సింగ్, కేంద్ర మంత్రి అశ్విని చౌబే వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మానసిక స్థితిని ఇది తెలియజేస్తున్నదంటూ విమర్శించారు.