గుజరాత్లో మార్పు రావాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఢిల్లీలో ఎంతో సక్సెస్ సాధించిందని చెప్పుకొచ్చారు. అలాగే పంజాబ్లో కూడా మార్పు ప్రారంభమైందన్నారు.
గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అనేది అధ్వాన్న స్థాయికి చేరుకుందని మండిపడ్డారు. ఇప్పటి వరకూ గుజరాత్లో 6,000 పాఠశాలలను మూసేశారని పేర్కొన్నారు. మరికొన్ని అధ్వాన్న స్థాయిలో వుండిపోయాయన్నారు.
ఇలా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను సరిగ్గా చేయకపోవడం వల్ల పిల్లల భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడిందని విమర్శించారు. ఢిల్లీ తరహాలో పాఠశాలలను మార్చేస్తామని, గుజరాత్లో పరిస్థితిని మార్చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
పరీక్షా పేపర్ లీకేజీ అన్న అంశంలో బీజేపీ వరల్డ్ రికార్డ్ సాధించిందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీ కాకుండా ఒక్క పరీక్షనైనా నిర్వహించగలరా? అంటూ గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్కు సీఎం కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు. గుజరాత్లో తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పాఠశాలలను తీర్చిదిద్దకపోతే.. నన్ను బయటకు తోసేయండి అంటూ కేజ్రీవాల్ ఛాలెంజ్ విసిరారు.