హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్కు వెళ్లిన కేసీఆర్, ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామ సైఫయీలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు ములాయం పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ములాయం కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి తదితరులు కూడా ములాయంకు నివాళి అర్పించారు. ములాయం అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ల్లారు. అక్కడ రెండు రోజులపాటు ఉండే అవకాశం ఉన్నది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తరువాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లటం ఇదే మొదటిసారి. ఢిల్లీ చేరుకొన్న తర్వాత బీఆర్ఎస్ కోసం సర్దార్ పటేల్ మార్గ్లో సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో చేయాల్సిన మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోధ్పూర్ వంశీయుల బంగ్లాను బీఆర్ఎస్ కార్యాలయం కోసం లీజుకు తీసుకొన్న విషయం తెలిసిందే.