పంజాబ్లో సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆప్ సీఎం, ఆప్ అధిష్ఠానం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టక మునుపే వీవీఐపీ సెక్యూరిటీలను వాపస్ తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక… మొదటి కేబినెట్ మీటింగ్లోనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఇక తాజాగా.. సీఎం మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు.కొత్తగా ఎన్నికైన పంజాబ్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ వర్చువల్ మీట్ నిర్వహించారు.
సీఎం భగవంత్ మాన్ తన కేబినెట్లోని ప్రతి మంత్రికీ… ఓ టార్గెట్ విధించారని, ఆ టార్గెట్ను చేరుకో లేని పక్షంలో ఆ మంత్రిని బాధ్యతల నుంచి తప్పించాలని ప్రజలు డిమాండ్ చేయవచ్చని సూచించారు. కేవలం మూడే మూడు రోజుల్లో సీఎం మాన్ పంజాబ్ను దాదాపుగా అర్థం చేసుకున్నారని ప్రశంసించారు. ఇప్పటికే రాజకీయ నేతలకు సెక్యూరిటీని తొలగించి, ప్రజలకు పూర్తి సెక్యూరిటీ ఇస్తున్నారని పేర్కొన్నారు. పంట నష్టానికి తగిన పరిహారం కూడా ఇస్తున్నారని, అవినీతి నిరోధక చర్యలను కూడా తీసుకుంటున్నారని కేజ్రీవాల్ ప్రశంసించారు.