న్యూఢిల్లీ, జూన్ 2: దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, టీకాల కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు భారత్లో పరీక్షలు అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిబంధనల్లో మార్పులు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం పొందిన టీకాలకు దేశంలో బ్రిడ్జ్ ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ‘అమెరికా ఎఫ్డీఏ, ఈఎంఏ, యూకే ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ జపాన్ లేదా డబ్ల్యూహెచ్వో అత్యవసర అనుమతులు పొందిన టీకాల్లో లక్షలాది మంది ప్రజలు వినియోగించిన వాటికి స్థానిక ట్రయల్స్ నుంచి మినహాయింపునిచ్చాం. అవి భారత్లో అనుమతుల కోసం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ లేబోరేటరీలో (సీడీఎల్) బ్రిడ్జ్ ట్రయల్స్ను నిర్వహించాల్సిన అవసరం లేదు’ అని డీసీజీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ల పనితీరును అంచనా వేసేందుకు తొలుత 100 మందికి టీకాలు ఇస్తామని, వారంపాటు వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోతే విస్తృతస్థాయి వ్యాక్సినేషన్లో సదరు టీకాలను వినియోగిస్తామని డీసీజీఐ తెలిపింది. టీకాల కొరతను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. స్థానికంగా (భారత్లో) ప్రయోగ పరీక్షలు చేపట్టకుండానే తమ వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వాలని ఫైజర్, మోడెర్నా తదితర వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
‘ఇండెమ్నిటి’కి ఓకే!
ఇండెమ్నిటి విషయంలో ఫైజర్, మోడర్నా సంస్థలు చేసుకున్న అభ్యర్థనను అంగీకరించడానికి ఎలాంటి అభ్యంతరంలేదని కేంద్రఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్, మోడెర్నా టీకాలకు ఇండెమ్నిటి ఇచ్చిన వివిధ దేశాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపాయి.
ఇండెమ్నిటి అంటే ఏమిటి?
టీకా వేసుకున్న వారిలో ఏమైనా దుష్ప్రభావాలు ఎదురైతే వారు న్యాయపరంగా నష్టపరిహారాన్ని ఆశించే అవకాశమున్నది. అయితే, ఈ న్యాయపరమైన చిక్కులను టీకా తయారీ సంస్థల పరిధిలోకి తీసుకురాకుండా, ఆయా దేశ ప్రభుత్వాలే పరిష్కరించేలా రూపొందించిందే ‘ఇండెమ్నిటి ’ విధానం. దీనికి ఏదైనా దేశం అనుమతినిస్తే, వ్యాక్సినేషన్లో తలెత్తే సమస్యలకు ఆయా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు ఇండెమ్నిటికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ జాబితాలో అమెరికా, ఐరోపా సంఘం, కెనడా, జపాన్, అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి.