న్యూఢిల్లీ : పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 16 ఏండ్ల కొలంబో స్కూల్ పదో తరగతి విద్యార్థి.. టీచర్ల నుంచి అవమానాలు, వేధింపులు తట్టుకోలేక ఉసురు తీసుకుంటున్నానని, వారిపై చర్యలు తీసుకోవాలని తన సూసైడ్ నోట్లో విజ్ఞప్తి చేశాడు.
‘అమ్మా నన్ను క్షమించు. స్కూల్ సిబ్బంది వేధింపులకే నేనీ పని చేస్తున్నా. మరణించాక నా అవయవాలు ఏమైనా పనికి వస్తే వాటిని అవసరమైన వారికి అమర్చండి. అమ్మా.. నీ హృదయాన్ని చాలాసార్లు బాధపెట్టా. ఇప్పుడు ఆఖరిసారిగా చేస్తున్నా’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. విద్యార్థి ఆత్మహత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ ఎదుట విద్యార్థ్ధులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు నలుగురు టీచర్లను సస్పెండ్ చేశారు.