అహ్మదాబాద్: పదో తరగతి హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతోపాటు జవాబులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో పదో తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం హిందీ పరీక్ష నిర్వహించారు. అయితే దీని ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయ్యింది. ఒకవైపు విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా మరోవైపు ప్రశ్నాపత్రంతోపాటు జవాబులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్ ఎడ్యుకేషన్ బోర్డు దృష్టికి ఇది వెళ్లింది. దీంతో దీనిపై దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.
మరోవైపు పదో తరగతి హిందీ పేపర్ లీక్పై గుజరాత్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తరచుగా పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని విమర్శించింది. ఇంతకుముందు రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లు మాత్రమే లీక్ అయ్యేవని, ఇప్పుడు 10వ తరగతి బోర్డు పరీక్షలు కూడా లీక్ అవుతున్నాయని ఆరోపించింది. దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి జితు వాఘని రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.