చిక్కడపల్లి : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. అదే విధంగా రైతు బంధు, బీమా అందించడం అభినందనీయయన్నారు. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘాలు, కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 26న నిర్వహిస్తున్న బంద్ సందర్భంగా సదస్సును నిర్వహించారు. నారాయణమూర్తి మాట్లాడుతూ రైతులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం మొత్తం అంధకారం అవుతుందని చెప్పారన్నారు. కానీ నేడు సీఎం కేసీఆర్ కృషితో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతున్నదన్నారు. రైతు చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా దేశానికి వెన్నుముక అయిన రైతులు మూడు పంటలను అందించారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు టి.సాగర్, పద్మ, వెంకటేశ్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.