న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులై ఆదివారానికి ఏడాది పూర్తైంది. జస్టిస్ రమణ 2021 ఏప్రిల్ 24న సీజేఐగా ప్రమాణం చేశారు. ఈ ఏడాది కాలంలో ఆయన ఎన్నో కీలక పరిపాలన నిర్ణయాలు తీసుకొన్నారు. కోర్టుల్లో ఖాళీల భర్తీకి చర్యలను వేగవంతం చేశారు. మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యం పెంచడానికి ప్రాధాన్యమిచ్చారు. న్యాయవ్యవస్థలో మార్పు కోసం అనేక ప్రతిపాదనలు చేశారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. సీజేఐగా జస్టిస్ రమణ పదవీ కాలంలో ముఖ్యమైన ఘట్టాలు.. ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది జడ్జిలను ఒకేసారి సుప్రీం కోర్టుకు నామినేట్ చేయడం, ఈ సిఫారసులకు కేంద్రం ఆమోదించడం. దాదాపు 200 మంది జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫారసు చేయడం. వీరిలో 126మంది నియామకానికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది.