న్యూఢిల్లీ, జనవరి 3: సినిమా హాళ్ల యాజమాన్యాలకూ, ప్రేక్షకులకు మధ్య తినుబండారాల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. యాజమాన్యాలకు ధరలను నిర్ణయించడంలో, ఇతర నిబంధనల విషయంలో పూర్తి హక్కులున్నాయని తేల్చిచెప్పింది. తమ పరిసరాల్లో అమ్మే తినుబండారాలు, పానీయాలు మాత్రమే కొనాలని, బయటి పదార్థాలు తీసుకురాకూడదని నిర్ణయించే హక్కు వారికి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రేక్షకులు కావాలంటే వాటిని కొనకుండా ఉండొచ్చని తెలిపింది. అయితే తల్లిదండ్రులు పసివారి కోసం తెచ్చుకొనే తినుబండారాలను మాత్రం అనుమతించాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొన్నది.
విచారణ సందర్భంగా సీజేఐ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హాళ్లు ప్రైవేటు ఆస్తులని, నిషేధాలు నిర్ణయించే హక్కు యజమానికి ఉంటుందని ఆయన అన్నారు. ఎవరైనా వ్యక్తి బయటి నుంచి సినిమా హాలులోకి జిలేబీ తెచ్చుకున్నాడనుకుందాం.. అతడు జిలేబీ తిని సీటుకు చేతిని రాసెయ్యొచ్చు. అప్పుడది అనవసరంగా పాడు చేసినట్టు అవుతుంది అని వ్యాఖ్యానించారు. పరిశుభ్రమైన తాగునీరు మాత్రం ఉచితంగా అందుబాటులో ఉంచాలని, పసివాళ్ల కోసం తల్లిదండ్రులు తెచ్చుకునేవి అనుమతించాలని నొక్కిచెప్పారు. సినిమా హాళ్లలోకి ప్రేక్షకులు సొంత తినుబండారాలు తెచ్చుకోవడాన్ని అనుమతించాలని జమ్ముకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.