చండీగఢ్: ఒక స్కూల్లో క్రిస్మస్ కార్నివాల్ జరుగుతుండగా అక్కడకు వచ్చిన కొందరు ‘జై శ్రీ రామ్’ నినాదాలతో అంతరాయం కలిగించారు. హర్యానాలోని గుర్గావ్లో ఈ ఘటన జరిగింది. పటౌడీ పట్టణంలోని నర్హెరా గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో గురువారం హౌస్ హోప్ గురుగ్రామ్ అనే బృందం క్రిస్మస్ కార్నివాల్ నిర్వహించింది. ఒక పాట తర్వాత క్రీస్తును స్తుతించారు. అయితే విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మర్చే ప్రయత్నంగా కొందరు స్థానికులు భావించారు. ఈ నేపథ్యంలో పటౌడీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్ర సింగ్ పహారీ ఈ కార్నివాల్ గురించి తెలుసుకున్నారు. తన మద్దతుదారులను కూడగట్టుకుని ఆ పాఠశాలకు వెళ్లారు. కార్నివాల్ ముసుగులో ప్రజలను ప్రలోభపెట్టి మత మార్పుడులకు ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, హిందువులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నరేంద్ర సింగ్ ఆరోపించారు. అక్కడ ఉన్న వారి నుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘క్రైస్తవ మతం ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. మేము ఏసుక్రీస్తును అగౌరవపరచడం లేదు. కానీ భావి తరాలకు ఆయనను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాము. వారు కోరుకుంటే, చట్టబద్ధంగా చేయండి. కానీ మత మార్పిడి ప్రయత్నాలకు లొంగిపోకండి. ఇది భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుంది’ అని అన్నారు. అనంతరం తన మద్దతుదారులతో కలిసి ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. క్రిస్మస్ కార్నివాల్కు అంతరాయం కలిగించారు.
కాగా, ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, పరిస్థితిని చక్కదిద్దామని పోలీసులు తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయితే గుర్గావ్లోని బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం ముస్లింల ప్రార్థనలను స్థానికులు అడ్డుకుంటున్న తరుణంలో జరిగిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
‘శుక్రవారం ప్రార్థనలకు అంతరాయం కలిగించిన గురుగ్రామ్ మరో రికార్డు సృష్టించింది. క్రిస్మస్ సందర్భంగా పటౌడీ పట్టణంలో ప్రార్థనలకు అంతరాయం ఏర్పడింది. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే స్థాయి నుంచి ‘పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు’ అనే స్థాయికి దిగజారింది’ అని మొహమ్మద్ గజాలి అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
మరోవైపు ‘చర్చి చుట్టూ మహిళలు, పిల్లలు ఉండటం చాలా భయానకంగా ఉంది. రోజురోజుకు ఈ ఉపద్రవం పెరుగుతోంది. ఇది ప్రార్థనలు, మతాన్ని అనుసరించే మా హక్కును ఉల్లంఘించడమే’ అని స్థానిక పాస్టర్ ఒకరు పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.