నాగపూర్: గోదాని ప్రాంతంలో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీకేజీ(Chlorine Gas Leakage) అయ్యింది. ఈ ఘటనలో 52 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నగరంలోని కలెక్టర్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 12మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం పేషెంట్లు అందరూ నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేర్చిన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఫిర్యాదు నమోదు కాలేదని మాన్కాపూర్ పోలీసు స్టేషన్ అధికారి పేర్కొన్నారు. క్లోరిన్ గ్యాస్ లీకేజీ వల్ల స్థానికుల్లో బ్రీతింగ్ సమస్యలు ఉత్పన్నం అయినట్లు తెలిసింది.
అనేక మందిని సమీపంలోని మయో ఆస్పత్రికి తరలించారు. అనేక మంది ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చేర్పించారు. ట్యాంకర్ సమీపంలోని ప్రాంతంలో ఇంకా క్లోరిన్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. క్లోరిన్ గ్యాస్ గాఢత ప్రస్తుతం క్షీణిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆరెంజ్ సిటీ వాటర్ వర్క్స్, ఎన్డీఆర్ఎఫ్, నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బృందాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి జనాన్ని తరలిస్తున్నారు. సోమవారం ఉదయం కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.
గోదాని గ్రామ పంచాయతీ ఆ వాటర్ ప్లాంట్ను ఆపరేట్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కానీ సమాచారం రావడంతో ఓసీడబ్ల్యూ బృందం తక్షణమే స్పందించిందని, క్లోరిన్ లీకేజీని అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సమీపంలో గత ఆరు నెలల నుంచి సుమారు 900 కేజీల క్లోరిన్ ట్యాంక్ ఉంటోందని, దానికి లీకేజీ డెవలప్ అయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రదేశాల్లో వీధి కుక్కలు చనిపోయినట్లు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు లేవు.