Chirag on Nitish Kumar | బీహార్లో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికి సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నితీశ్కుమార్కు దమ్ముంటే తాజాగా ప్రజాతీర్పు కోరాలని అన్నారు. గత ఎన్నికల్లో నితీశ్ కుమార్ బలం 43 స్థానాలకు పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో జీరో అవుతుందని ఎద్దేవా చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూను బలహీన పరిచేందుకు బీజేపీతో కలిసి చిరాగ్ పాశ్వాన్ కుట్ర చేశారని ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి బీహారీ ప్రజల తీర్పును నితీశ్ కుమార్ అవమానిస్తున్నారని ఆరోపించారు.
నితీశ్కుమార్కు మున్ముందు కష్టకాలమేనని చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. సీఎం వ్యక్తిగత ఆకాంక్షలు చాలా ఎక్కువ అని ఆరోపించారు. మహారాష్ట్రలో మాదిరిగా జేడీయూను బలహీనపరిచేందుకు బీజేపీ కుట్ర చేసిందన్న ఆరోపణలను పాశ్వాన్ కొట్టి పారేశారు. ఇవన్నీ కుంటి సాకులన్నారు. నితీశ్ అహంకారం వల్ల బీహార్ చాలా నష్టపోయిందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లే లక్ష్యంగా నితీశ్కు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయని మండిపడ్డారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఎటువంటి విలువల్లేవని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఆయన హయాంలో బీహార్లో ఎటువంటి అభివృద్ధి జరుగలేదన్నారు. నితీశ్కుమార్కు ఎటువంటి విశ్వసనీయత లేదని అన్నారు. నితీశ్ కుమార్ ఎప్పుడైనా రూట్ మారుస్తారని అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెప్పానని, ఈరోజు అది జరిగిందన్నారు.