న్యూఢిల్లీ: గుజరాత్, ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలను (Chinese Fishing Vessels) నిఘా సంస్థలు గుర్తించాయి. మినీ గూఢచార నౌకలుగా పని చేస్తున్న వీటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. జలాంతర్గాములు, రహస్య పైప్లైన్లు, ఇండియన్ పోర్ట్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవి సేకరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో రక్షణ పరంగా పొంచి ఉన్న ముప్పుపై ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి.
కాగా, భారత్ ఆధిపత్య సముద్ర జలాల్లోకి చైనా ఓడల ఆకస్మిక ప్రవేశాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో అవలంభిస్తున్న వ్యూహాల మాదిరిగా గ్రే జోన్లో చైనా కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు పలు యుద్ధ నౌకలను మోహరించినట్లు పేర్కొంది. ‘చాలా చైనా ఓడలు వ్యూహాత్మకంగా భారత్ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఈఈజెడ్) ముగిసే 200 నాటికల్ మైళ్ల వెలుపల ఉన్నాయి’ అని ఇండియన్ నేవల్ డిఫెన్స్ అడ్వైజరీ గ్రూప్కు చెందిన సీనియర్ నేవీ కమాండర్ ధృవీకరించారు.
మరోవైపు గుజరాత్, ముంబై తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో ఉన్న ప్రత్యేక ఆర్థిక జోన్ (ఈఈజెడ్)ను ప్రస్తుతం ఉన్న 200 నాటికల్ మైళ్ల నుంచి 500 నాటికల్ మైళ్లకు విస్తరించాలని భారత్ డిమాండ్ చేస్తున్నది. ఐక్యరాజ్యసమితి (యూఎన్)ని ఈమేరకు అభ్యర్థించింది. చైనా గ్రే జోన్ విధానం పశ్చిమ తీరంలో భారత ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు పెను ముప్పుగా పేర్కొంది.