న్యూఢిల్లీ: ఓవైపు ఇండియాకు సాయం చేస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు ఇక్కడికి రావాల్సిన విమానాలను అడ్డుకుంటోంది చైనా ప్రభుత్వం. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ శనివారం ట్విటర్లో వెల్లడించాడు. వందలాది ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్లను ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ చైనా మాత్రం మా కంసైన్మెంట్లను అడ్డుకుంటోంది. ఇక్కడ నిమిషానికో ప్రాణం పోతోంది. మా కంసైన్మెంట్లు మాకు అందేలా సాయం చేయండంటూ భారత్లో చైనా రాయబారితోపాటు చైనా విదేశాంగ శాఖలను ట్యాగ్ చేశాడు.
దీనిపై గంటల వ్యవధిలోనే చైనా రాయబారి సన్ వీడాంగ్ స్పందించారు. మీ ట్విటర్ సమాచారం మాకు అందింది. కొవిడ్పై పోరులో ఇండియాకు చైనా సాయం చేస్తుంది. ప్రస్తుతం ఇండియా, చైనా మధ్య సరుకుల రవాణా సాధారణంగా ఉంది. గత రెండు వారాలలో 61 సరుకుల విమానాలు ఇండియా, చైనా మధ్య నడిచాయి అని వీడాంగ్ ట్వీట్ చేశారు.
ఇండియాకు అన్ని రకాల సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత ప్రధాని మోదీకి సందేశం పంపిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం. కొవిడ్పై పోరు సాయం చేస్తున్నామని, చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఓవైపు ప్రకటనలు ఇస్తూనే మరోవైపు ఇండియాకు రావాల్సిన అత్యవసర పరికరాలు, మందులను అడ్డుకుంటోంది.