న్యూఢిల్లీ, డిసెంబర్ 14: డోక్లాం.. 2017లో 73 రోజుల పాటు భారత్, చైనా మధ్య నెలకొన్న వివాదానికి కేంద్ర బిందువైన ప్రాంతం. ఈ ప్రాంతం తమదని భూటాన్, చైనాలు ఏండ్లుగా వాదించుకొంటున్నాయి. భారత్లోని సిక్కిం సరిహద్దుకు ఆనుకొని ఉండే డోక్లాం రీజియన్లో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణం తమ దేశ సరిహద్దు భద్రతకు ముప్పు అని భారత్ బలగాలు అడ్డుకోవడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తర్వాత చర్చల అనంతరం రెండు దేశాలు తమ బలగాలను వెనక్కు పిలిపించుకొన్నాయి. అయినప్పటికీ 2017 తర్వాత కూడా చైనా డోక్లాం రీజియన్లో నిర్మాణాలు కొనసాగిస్తూ బరితెగిస్తున్నది. కొత్త బ్రిడ్జిల నిర్మాణం, ఇప్పటికే ఉన్న గ్రామాలను విస్తరిస్తున్నట్టు ఇటీవలి శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. తాజాగా అరుణాచల్ సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో.. ఇక్కడ కూడా మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శరవేగంగా నిర్మాణాలు
భారత్లోని సిక్కిం, భూటాన్, చైనా దేశాల మధ్య జంక్షన్లా డోక్లాం రీజియన్ ఉంటుంది. డోక్లాం సమీపంలో చైనా మౌలిక సదుపాయాల నిర్మాణాలను వేగవంతం చేసినట్టు తెలుస్తున్నది. టన్నెళ్లు నిర్మించడంతో పాటు సైనిక మోహరింపును రెట్టింపు చేసిందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం సమీప ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేపట్టినట్టు కూడా అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ తాజా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. భూటాన్ భూభాగంలో చైనా ఏర్పాటు చేసుకొన్న లాంగ్మార్పో అని పిలువబడే ఉత్తర సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉండే ప్రాంతంలో కొత్త గ్రామాల సమూహాన్ని నిర్మిస్తున్నది. ఈ ప్రాంతాల్లో సైబురు, కైతాంగ్షా, క్యూలే ఉన్నాయి.
సిలిగురి కారిడార్కు దగ్గరిగా..
వివాదాస్పద డోక్లాం రీజియన్కు సమీపంలో 2020లో నిర్మించిన పంగ్డా గ్రామాన్ని 2021లో విస్తరించారు. పంగ్డా సమీపంలో గత ఏడాది నవంబర్లో లేని నిర్మాణాలు.. ఈ డిసెంబర్లో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. పంగ్డాకు దక్షిణాన కొత్త భవన నిర్మాణ సముదాయాలు, టోర్సా నదిపై బ్రిడ్జి నిర్మాణం వంటివి ఇటీవలి శాటిలైట్ చిత్రాల్లో చూడవచ్చు. దీని ద్వారా సిలిగురి కారిడార్ సమీపానికి చైనా బలగాలు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదనేది భారత్ ఆందోళన. డోక్లాంకు దక్షిణ ప్రాంతంలో కూడా భూమిని చదును చేసినట్టు తాజా చిత్రాలు స్పష్టంచేస్తున్నాయి.