చైనా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్న రోజు నుంచి ఎంతో వేధించారని అరుణాచల్ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ టారన్ తెలిపారు. ప్రతిరోజూ తనకు కరెంట్ షాకిచ్చారని, చంపేస్తారేమో అని భయపడ్డా అని ఏడుస్తూ చెప్పాడు. ఎట్టకేలకు కన్నవారి వద్దకు చేరడంతో బతికిపోయినట్లుగా భావించానని అన్నాడు.
అరుణాచల్ప్రదేశ్కు చెందిన 17 ఏండ్ల యువకుడు మిరమ్ టారన్ను జనవరి 18న సరిహద్దు నుంచి చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. చైనా సైన్యం కస్టడీలో దాదాపు 200 గంటలపాటు ఉన్నట్లు మిరమ్ టారన్ వెల్లడించాడు. భారత్కు అప్పగించే ముందు 8 రోజుల పాటు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. భారత సైన్యానికి అప్పగించిన అనంతరం మిరమ్ టారన్ మీడియాతో మాట్లాడారు.
‘వారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఎక్కడికైనా తీసుకెళ్ళి చంపేస్తారని భయపడ్డాను. చైనా సైనికులు నా కళ్లకు గంతలు కట్టి ఓ శిబిరానికి తీసుకెళ్లారు. భయంతో ఏడవలేకపోయాను. వాళ్లు నాతో ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వారి భాష నాకు అర్థం కాలేదు. దాంతో ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను. ఇక అప్పటి నుంచి నన్ను తన్నడం, కొట్టడం మొదలెట్టారు. ఆ తర్వాత కరెంట్ షాక్ ఇవ్వడం ప్రారంభించారు. కేవలం తినే సమయంలో, మరుగుదొడ్డికి వెళ్లినప్పుడే నా చేతులు, కాళ్లకు కట్లు, కండ్లకు గంతలు విప్పేవారు’ అని తన అనుభవాన్ని వెల్లడించాడు.
జిండన్ గ్రామానికి చెందిన మీరమ్ టారన్ స్నేహితుడు జానీతో కలిసి జనవరి 18న సరిహద్దు సమీపంలో వేటకు వెళ్లాడు. అక్కడ వారిని చైనా సైన్యం చుట్టుముట్టింది. జానీ తన వద్ద ఉన్న తుపాకీతో సైనికులపైకి గురిపెట్టి తప్పించుకున్నాడు. మిరమ్ మాత్రం సైనికులకు పట్టుబడ్డాడు. జానీ గ్రామానికి చేరుకుని మిరమ్ తండ్రికి, ఇండియన్ ఆర్మీకి సమాచారం ఇచ్చాడు. ఇలాఉండగా, తమపై వచ్చిన ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. జనవరి 20న తమ సైన్యం గుర్తు తెలియని యువకుడిని గుర్తించి భారత సైన్యానికి సమాచారం ఇచ్చిందని తెలిపింది.