China | రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం తెలియగానే డ్రాగన్ ప్రభుత్వం విష ప్రచారాన్ని మొదలు పెట్టింది. భారత సైన్యాన్ని దృష్టిలో వుంచుకొని, లేని పోని విష ప్రచారానికి ఒడిగడుతోంది. భారత, చైనా సైనికాధికారుల మధ్య 14 వ రౌండ్ చర్చలు బుధవారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తన అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వేదికగా చైనా సర్కార్ భారత సైన్యం విషయంలో అపోహలను ప్రచారం చేసింది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా వచ్చిందంటే దాని ప్రభావం దేశంలోని సామాన్య ప్రజలతో పాటు భారత సైన్యంపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపించిందని వ్యాఖ్యానించింది. ఈ పరిణామం భారత సైనికుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్నే చూపెడుతుందని పేర్కొంది. ఎందుకంటే షిఫ్టులను మార్చే క్రమంలో అతి తక్కువ మందిని మార్చుకుంటారని, దీని కారణంగానే సైనికుల మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని కొత్త కథను అల్లే ప్రయత్నం చేసింది.
రక్షణ మంత్రి రాజ్నాథ్కు కరోనా సోకితే.. దీని ప్రభావం సైనికులపై కూడా ఉంటుందని, సైనికుల మానసిక స్థితి దెబ్బతింటుందన్న చైనా వాదనను భారత మాజీ సైనికాధికారులు తోసి పుచ్చారు. అంత బలహీన మనస్తత్వం భారత సైనికులది కాదని తేల్చి చెప్పారు. రక్షణ మంత్రికి కరోనా సోకితే, ఆ ప్రభావంతో ఢీలా పడిపోయే తత్వం భారత సైనికులకు లేదని మాజీ మేజర్ జనరల్ ఏకే సివాచ్ తేల్చి చెప్పారు. ఎంతటి విపత్కర పరిస్థితులున్నా… తట్టుకొని నిలబడుతూ, దేశం కోసం విధులు నిర్వర్తించే సత్తా భారత సైనికుల సొంతమని ఆయన తేల్చి చెప్పారు. బుధవారం జరగబోయే 14 వ రౌండ్ చర్చలపై చైనా చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏమాత్రం ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు.