న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా బతికున్న 60 చిన్న పురుగులు. అదీ కూడా కంటి నుంచి బయటపడ్డాయంటే తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘మిర్రర్’ కథనం ప్రకారం ఒక గుర్తు తెలియని మహిళ ఇటీవల కండ్ల దురదతో ఇబ్బంది పడుతున్నది. దీంతో కంటిని నులుముకోగా ఒక పురుగు బయటపడటంతో బెంబేలెత్తిన ఆమె కన్మింగ్లో ఉన్న ఒక దవాఖానకు వెళ్లగా డాక్టర్లు పరీక్షించి కంటికి శస్త్ర చికిత్స చేశారు.
ఆపరేషన్ సమయంలో జీవించి ఉన్న ఒక్కో పురుగు ఆమె కండ్లలో నుంచి బయటపడుతుండటంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. చివరకు ఆమె రెండు కళ్లలోంచి జీవించి ఉన్న 60 సూక్ష్మమైన పురుగులను వెలికితీసినట్టు తెలిపారు. కనుగుడ్డు, కనురెప్ప మధ్యన ఈ జీవులు తిష్ట వేసినట్టు వారు చెప్పారు. ఫిలరియోడియా అనే ఏలికపాముల ద్వారా ఈ వ్యాధి సోకి ఉంటుందని, సాధారణంగా ఇది ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుందని ఆపరేషన్కు నేతృత్వం వహించిన డాక్టర్ గువాన్ తెలిపారు.