న్యూఢిల్లీ: భారత్ పవర్ గ్రిడ్లపై చైనా హ్యాకర్లు సైబర్ దాడులు పాల్పడుతున్నారు. గత ఎనిమిది నెలలుగా లడఖ్ సమీపంలోని విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సంస్థ రికార్డ్ ఫ్యూచర్ ఈ మేరకు ఒక నివేదికను బుధవారం విడుదల చేసింది. చైనా హ్యాకర్లు ఇటీవల ఏడు భారతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రాలను (ఎస్ఎల్డీసీ)ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాము గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. ఉత్తర భారత్తోపాటు చైనాతో వివాదం ఉన్న లఢక్ సరిహద్దుకు సమీప ప్రాంతంలోని విద్యుత్ గ్రిడ్ల నెట్వర్క్ను చైనా హ్యాకర్లు ప్రధానంగా టార్గెట్ చేశారని పేర్కొంది.
2021 ఫిబ్రవరిలో భారత్, చైనా మధ్య లడఖ్ సరిహద్దులో ఘర్షణ అనంతరం ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఈ సైబర్ దాడులు జరిగాయని రికార్డ్ ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన చైనా ప్రభుత్వ ప్రాయోజిత కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ల నుంచి భారతీయ లోడ్ డెస్పాచ్ సెంటర్లలోకి వచ్చి వెళ్లే డేటాను తమ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. పవర్ గ్రిడ్లతోపాటు జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, అంతర్జాతీయ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థలో కూడా చైనా హ్యాకర్ల సైబర్ దాడులను గుర్తించినట్లు వివరించింది.
తొలుత రెడ్ఎకో, తాజాగా ట్యాగ్-38 వంటి చైనా పీపుల్స్ ఆర్మీ మద్దతిచ్చే హ్యాకర్లు దీర్ఘకాల వ్యూహంలో భాగంగా గత 18 నెలల్లో భారత్ వంటి నిర్దేశిత దేశాల్లో సైబర్ దాడులకు పాల్పడుతున్నారని రికార్డ్ ఫ్యూచర్ తెలిపింది. క్లోజ్-సర్క్యూట్ టెలివిజన్స్ (సీసీటీవీ) నెట్వర్క్లలో ఉపయోగించే ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) కెమెరాలు, ఇంటర్నెట్-ఆపరేటెడ్ డిజిటల్ వీడియో రికార్డింగ్ (డీవీఆర్) పరికరాల ద్వారా హ్యాకింగ్కు ప్రయత్నించారని పేర్కొంది. తమ దర్యాప్తులో తెలుసుకున్న ఈ సైబర్ దాడుల గురించి భారత ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు లడఖ్ సమీపంలోని విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు చైనా హ్యాకర్లు చేసిన రెండు ప్రయత్నాలు ఫలించలేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఇలాంటి సైబర్ దాడులను ఎదుర్కోవడానికి ఇప్పటికే సంబంధిత రక్షణ వ్యవస్థను పటిష్టం చేసినట్లు ఆయన చెప్పారు.