సైన్యాధిపతి నరవణె వెల్లడి.. హావిట్జర్ను మోహరించిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లఢక్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా భారీగా బలగాలను మోహరిస్తున్నదని ఆర్మీ చీఫ్ నరవణె తెలిపారు. ఇది ఆందోళనకర విషయమని చెప్పారు. చైనా చర్యలను అనుక్షణం గమనిస్తున్నామని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తూర్పు లఢక్ వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ ‘సరిహద్దులోని వాస్తవాదీన రేఖ వెంట చైనా నిర్మాణాలు చేపడుతున్నది. బలగాలను మోహరిస్తున్నది. భారత్ దగ్గరా అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని చైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చైనా మొండిగా వ్యవహరించినా.. ఎలాంటి చర్యలకు పాల్పడినా.. తగిన బుద్ధి చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధమే’ అని తెలిపారు. మరోవైపు ఎల్ఏసీ వెంట భారత్ కూడా స్వీయ చోదక వజ్ర హావిట్జర్ను మోహరించింది. 50 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఈ హావిట్జర్ ఛేదించగలదు.