ముంబై : కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాను రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పునావాలా మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం కోవోవాక్స్ ట్రయల్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. టీకా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు కరోనా నుంచి కాపాడుతుందని చెప్పారు.
ప్రస్తుతం సీరం సంస్థ ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం తయారు చేసినట్లు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తు పిల్లల్లో తీవ్రమైన ఇబ్బందులు కనిపించడం లేదన్న ఆయన.. ఆరు నెలల్లోగా తప్పనిసరిగా పిల్లల టీకా మార్కెట్లోకి తీసుకువస్తామని, మూడేళ్లలోపు పిల్లలకు అందుబాటులో ఉంటుందన్నారు.
దేశంలో పిల్లల వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రెండు కంపెనీలకు లైనెన్స్ ఇచ్చారని, త్వరలోనే చిన్నారులకు టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తప్పనిసరిగా వాక్సిన్ వేయించాలని, వారికి ఎలాంటి హాని ఉండదని సూచించారు. టీకాలు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని స్పష్టం చేశారు.